పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం…బడుగు, బలహీనవర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగు దేశం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డైలాగులు వేస్తాడు కానీ…పేదలంటే, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలంటే తనకు ఎంత ద్వేషమో పలు సందర్భాల్లో తనకు తానుగా బయటపెట్టుకున్నాడు. గతంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ తన కుల అహంకారాన్ని ప్రదర్శించాడు. అలాగే గత టీడీపీ హయాంలో వెలగపూడి సచివాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకున్న నాయి బ్రాహ్మణులను..ఏం తమాషాలు చేస్తున్నారా…తోకలు కత్తిరిస్తా అంటూ బీసీలపై తనకున్న ఏహ్యభావాన్ని ప్రదర్శించాడు.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో చంద్రబాబు ప్రతాపరెడ్డి అనే వ్యక్తితో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేయించాడు. దీంతో స్థానిక సంస్థలో రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదంటూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు స్థానిక పాలనలో అవకాశం కల్పించే మంచి పనిని అడ్డుకున్న చంద్రబాబుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు. అలాగే ‘’అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్ని వర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశారంటూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో బడుగులపై చంద్రబాబు కపట ప్రేమను తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.