ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై ప్రతిపక్షనేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం రేట్లు పెరిగిపోయి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు…మద్యం దుకాణాల టైమింగ్స్ రాత్రి 8 వరకు కుదించడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని పొద్దున్నే వైన్షాపుల ముందు బారులు తీరుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, వైసీపీ నేతలు కమీషన్లు తీసుకుని చీప్ బ్రాండ్ల కంపెనీల మద్యం అమ్ముతున్నారని టీడీపీ నేత బోండా ఉమ ప్రెస్మీట్కు మద్యం సీసాలు పట్టుకుని వచ్చి మరీ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే మద్యంపై చంద్రబాబు . టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మందు బాటిళ్లు ముందుపెట్టుకుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. బార్ సేల్స్మెన్లా మాట్లాడారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలోనే ఈ విధంగా మందు బాటిళ్లు పెట్టుకుని ప్రెస్మీట్ పెట్టడాన్ని చూస్తే.. అది టీడీపీ ఆఫీసా, చంద్రన్న బెల్ట్ షాపా అర్థం కావట్లేదన్నారు. టీడీపీ నాయకులు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 9 నెలల నుంచి మద్యం బ్రాండ్లు లేవు..మద్యం దుకాణాల టైమ్ పెంచండి.. రేట్లు తగ్గించండి అంటూ చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిలా కాకుండా తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని రోజా ఫైర్ అయ్యారు.
అసలు మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా 43 వేల బెల్ట్ షాపులు తీసేసిన చరిత్ర ఉందా…అని టీడీపీ నేతలకు రోజా సూటిగా సవాలు విసిరారు. అదే మా ప్రభుత్వంలో సీఎం జగన్ ఒక నెలలోనే 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశారని రోజా చెప్పారు. మీ ప్రభుత్వంలో ఏనాడైనా వైన్స్లను, బార్షాపులను తగ్గించారా..మా ప్రభుత్వంలో వైన్షాపులను 20 శాతం, బార్షాపులను 40 శాతం తగ్గించామని రోజా తెలిపారు. ఈ రోజు మహిళంతా సీఎం జగన్కు హ్యాట్సాఫ్ అంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో నారావారి పాలన సారా పాలనగా తయారైందని, ప్రతి సంవత్సరం టార్గెట్లు పెట్టి మరీ ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని ఏరులై పారించారని రోజా ఆరోపించారు. ప్రతి ఏటా 20 శాతం మద్యాన్ని పెంచుకుంటూ పోయి. మహిళల తాళిబొట్లు తెంచుకుంటూ పోయిన చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ధ్వజమెత్తారు. ఇక గ్రామవాలంటీర్లు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలపై రోజా మండిపడ్డారు.. మీది నోరా తాటిమట్టా అని మండిపడ్డారు. మద్యాన్ని గ్రామవాలంటీర్లు డోర్ డెలివరీ చేశారని నిరూపిస్తే మా పదవులకు రాజీనామా చేస్తాం..అంతే కాని నోరు ఉంది కదా అని ఇష్టానికి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. మొత్తంగా నారావారి పాలన సారావారి పాలన అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.