ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. గత రెండున్నర నెలలుగా పైగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా..ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో మూడు రాజధానులపై ఎన్ని కుట్రలు చేసినా, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి ఎంత విషం కక్కినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలని కృత నిశ్చయంతో ఉన్న జగన్ సర్కార్ ముందుగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు ముహుర్తం ఖరారు అయింది. మే నెలలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడం, వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖ వెళ్లాల్సి వస్తే అక్కడ పిల్లలకు విద్యా సంస్ధల్లో సీట్లు తీసుకోవడం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలంటే తమకు రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతుండడంతో మే నెలలోనే సెక్రటేయట్ తరలింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే నెలకల్లా శాసనమండలి రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లుపై కేంద్రం నుంచి రాజ్యాగం పరమైన అనుమతులు వస్తాయని, ఈలోగా అమరావతి ఆందోళనలు చల్లారుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్లో విద్యార్ధుల పరీక్షలు పూర్తి కాగానే మే నెలలో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. మే నెలలో విశాఖకు రాజధాని తరలింపు ప్రారంభం కాగానే అక్కడి నుంచే పాలన ప్రారంభించేలా ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు సచివాలయం కోసం భవనాల అన్వేషణ కొనసాగుతోంది. అయితే ముందుగా సాధారణ పరిపాలన శాఖతో పాటు న్యాయ, ఆర్దిక శాఖల సిబ్బందిని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివర్లో సంక్షేమ శాఖలు విశాఖకు వెళ్లే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు.
మొత్తంగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొట్టి, రెండున్నర నెలలుగా ఉద్యమాలు చేయించినా..తాను స్వయంగా జోలెపట్టి అడుక్కున్నా…విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఆందోళనలను తీసుకు వెళ్లేందుకు యాత్రలు చేపట్టినా…విశాఖ, కర్నూలు రాజధానులపై ఎల్లోమీడియాతో విషం కక్కించినా, శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్నా.. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తుండడంతో చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లలో కలవరం మొదలైంది. మరి చంద్రబాబు విశాఖలో రాజధాని ఏర్పాటును అడ్డుకోవడానికి మళ్లీ ఏమైనా కుట్రలు చేస్తాడో చూడాలి.