టీడీపీ ఎంపీ గల్లాజయ్దేవ్కు అతి పెద్ద జలక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో వైయస్ హయాంలోనే చిత్తూరు జిల్లాలో గల్లా జయ్దేవ్కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ విస్తరణకు గాను 488 ఎకరాలను కేటాయించింది. అప్పట్లో వైస్ కేబినెట్లో గల్లా అరుణకుమారి మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను గుర్తించి మధ్యవర్తిత్వంతో ఆ భూమిని అమరరాజా సంస్థ కొనుగోలు చేసింది. అ భూముల్లో అమరరాజా బ్యాటరీస్ సంస్థను పూర్తి స్తాయిలో విస్తరించాలని ప్రణాళిక. అయితే ఆ మేరకు సంస్థను విస్తరించినా…మొత్తం 488 ఎకరాల్లో 244 ఎకరాల భూమిని మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుందంట..మిగతా భూమిని మాత్రం గల్లా ఫ్యామిలీ తమ ఆధీనంలోనే ఖాళీగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికీ భూ కేటాయింపులు జరిగి దశాబ్దం గడిచిపోయినా ఇప్పటికీ ఆ భూమిని గల్లా ఫ్యామిలీ ఖాళీగా ఉంచుకున్నట్లు జగన్ సర్కార్ గుర్తించింది. దీంతో గల్లా జయ్దేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి కేటాయించిన భూముల్లో ఖాళీగా ఉన్న 244 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ మేరకు ఏపీఐఐసీ మార్చి రెండో తేదీనే ప్రభుత్వానికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది. వచ్చే కేబినెట్ భేటీలో గల్లా భూములు వెనక్కి తీసుకునేందుకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది.
కాగా ఖాళీగా ఉన్న భూములను జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవడంపై గల్లా జయ్దేవ్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. అమరావతి ఆందోళనల్లో టీడీపీ ఎంపీ గల్లా జయ్దేవ్ యాక్టివ్గా పాల్గొంటున్నాడు. రాజధాని ప్రాంత రైతుల నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజధాని రైతుల ఆందోళనలకు కావాల్సిన ఆర్థిక సహాయసహకారాలు గల్లా అందిస్తున్నాడని సమాచారం. అందుకే గల్లా మీద కత్తి కట్టి ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవడంలో తప్పేముంది..దీన్ని కూడా టీడీపీ రాజకీయం చేయడం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా జగన్ సర్కార్ దెబ్బకు గల్లా అల్లాడిపోతున్నారు. మరి అమరరాజా బ్యాటరీస్కు కేటాయించిన ఖాళీ భూములను వెనక్కి తీసుకోవడంపై టీడీపీ మరెంత రచ్చ చేస్తుందో చూడాలి.