ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే నెపంతో గ్రామ, వార్డు వలంటీర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ వలంటీర్లపై దాడులు చేసిన ఉదంతం మరువకముందే మచిలీపట్నంలో మరొక ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొందరు తొమ్మిదో వార్డు సచివాలయం వద్ద వార్డు వలంటీర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డుల గురించి సర్వే చేస్తున్న వార్డు వలంటీర్లను…..ఓటరు గుర్తింపు కార్డులను పంచుతూ….వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసి వార్డు వలంటీర్లను చితక్కొట్టారు. ఒక మహిళా వలంటీర్ గర్భంతో ఉన్నానని చెప్పినా వినిపించుకోకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
వివరాల్లోకి వెళితే,… మచిలీపట్నం తొమ్మిదో వార్డు సచివాలయ పరిధిలో వార్డు వలంటీర్లు మద్దెల భారతి, గుల్ల మౌనిక శనివారం కొత్త బియ్యం కార్డుల జాబితాను పరిశీలిస్తున్నారు. అయితే, తమ ఓట్లను తొలగించేందుకే వలంటీర్లు ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారన్న అనుమానంతో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వార్డు వలంటీర్లతో వాదనకు దిగారు. తాము బియ్యం కార్డుల జాబితాను పరిశీలిస్తున్నామని చెబుతున్నా వినకుండా దుర్భాషలాడుతూ దాడికి తెగపడ్డారు. తాను గర్భవతినని, తనను విడిచిపెట్టాలని మద్దెల భారతి వేడుకున్నా వారు పట్టించుకోలేదు. ఆమెపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. రమణారెడ్డి అనే వ్యక్తి వలంటీర్లకు రక్షణగా నిలిచి, టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆయనపైనా పిడిగుద్దులు గుద్దుతూ దాడికి తెగపడ్డారు. ఈ ఘటనలో రమణారెడ్డితో పాటు వలంటీర్లు మద్దెల భారతి, గుల్ల మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు అంతటితో ఆగకుండా వార్డు సచివాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల సెల్ఫోన్లను బలవంతంగా లాక్కొని ధ్వంసం చేశారు. గాయపడిన మహిళా వలంటీర్లను స్థానికులు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. తీవ్ర గాయాలపాలైన వలంటీర్ మద్దెల భారతి స్టేషన్లో స్పృహతప్పి పడిపోగా పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై వార్డు వలంటీర్లు భారతి, మౌనిక మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఇంకా మొదలుకాకముందే టీడీపీ కార్యకర్తలు ఇలా వలంటీర్లపై దాడులకు పాల్పడడం రాజకీయంగా కలకలం రేపుతోంది.