స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా కీలక నేత రామసుబ్బారెడ్డితో పాటు మరో సీనియర్ నేత పాలకొండ్రాయుడు పార్టీకి గుడ్బై చెప్పి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీ గుడ్బై చెప్పారు. ఇటీవల శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా ఇప్పుడు ఏకంగా పార్టీనీ వీడుతూ సంచలనం రేపారు. ముఖ్యంగా చంద్రబాబు వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన రాజీనామా కారణాలు తెలుపుతూ…కార్యకర్తలకు, అభిమానులకు డొక్కా మాణిక్యవర ప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధిష్టాన వైఖరి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు. అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు అత్యంత వివాదాస్పదంగా జరిగే అవకాశం ఉందని గమనించానని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ, శాసనమండలి మధ్య సమతుల్యత దెబ్బతిని ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందనే భావనతో శాసనమండలి సమావేశాలకు చంద్రబాబు విప్ జారీ చేసినా హాజరు కాలేదని డొక్కా తన లేఖలో వివరించారు. అయితే కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లలో పత్రికల్లో రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై నీతిబాహ్యమైన, తప్పుడు ఆరోపణలు చేశారని డొక్కా ఆవేదన చెందారు. జేఏసీ పేరుతో టీడీపీ నేతలు చేసిన చౌకబారు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైఎస్సార్సీపీకి మానసికంగా దగ్గరయ్యానని..అయితే వైఎస్సార్సీపీ నాయకత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారనే చెప్పాలి.