ఏపీ పీసీపీ మాజీ ప్రెసిడెండ్, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అధికార వైసీపీలో చేరడం ఖాయమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, వివాదరహితుడిగా రఘువీరారెడ్డికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలను పక్కనపెడితే వైయస్ కుటుంబంతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైయస్ కేబినెట్లో రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అప్పట్లో రఘువీరా వైయస్కు నమ్మకస్తుడిగా, కుడిభుజంగా వ్యవహరించారు. వైయస్ మరణం తర్వాత రఘువీరా ఎందుకనో కాంగ్రెస్లోనే కొనసాగారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పని చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయింది. ఈ దశలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి ఆశించిన ఫలితాలను రాబట్టలేదు.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదంటే..ఆ పార్టీని పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతుంది. దీంతో వాస్తవ పరిస్థితిని గమనించిన రఘువీరా తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వ్యక్తిగత వ్యాపారాల్లో బిజీ అయ్యారు. గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా రెడ్డి మళ్లీ వైసీపీ లో చేరేందుకు కారణం వైయస్ జగనే అని అనంతపురంలో చర్చ జరుగుతుంది. తన తండ్రి వైయస్కు ఆప్తుడిగా.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న రఘువీరా రెడ్డి తమ పార్టీలోని ఎప్పుడొచ్చినా సరే.. స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నానని జగన్ రఘువీరారెడ్డికి ఇదివరకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమని అనంతపురం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రఘువీరారెడ్డి సన్నిహితులైన మాజీ కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటిరాంబాబు, ఆనం రామనారాయణ రెడ్డి వంటి నేతలు వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రఘువీరా కూడా వైసీపీలో చేరడం ద్వారా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. మొత్తంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా వైసీపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దుకాణం పూర్తిగా బంద్ అయిందనే చెప్పాలి.