వయో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, త్వరలోనే 57 ఏళ్ళు నిండి ఆ ఆపై వయసున్నవాళ్ళందరికీ పెన్షన్లు అందచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 57 ఏళ్ళు ఆ పై వయసు నిర్ధారణ కోసం పరీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరిగే విధంగా, స్క్రీనింగ్ సెంటర్లు పెడతామన్నారు. అసెంబ్లీలో శనివారం ఆసరా ఫించన్ల పథకంపై ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, కాలె యాదయ్య, కోరకంటి చందర్, గుర్క జైపాల్ యాదవ్ తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి దయాకర్ రావు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత వ్యూహంలో భాగంగా పేదలందరూ సురక్షితమైన గౌరవప్రదమైన జీవనము అందించాలనీ.. సమాజంలో దుర్బరమైన జీవితాన్ని గడుపుతున్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆసరా పెన్షన్లను నవంబర్, 2014 సంవత్సరమున ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా, వృద్ధులు, వితంతవులు, వికలాంగులు, ఆశక్తులైన కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులు (ఎప్రిల్, 2018 నుండి), బీడీ కార్మికులు ( మార్చి, 2015 నుండి), ఒంటరి మహిళలకు (ఎప్రిల్, 2017 నుండి) తదితరులు పించన్లు-ఆర్ధిక భృతిని పొందుతున్నారన్నారు.
జూన్ 2019 నుండి వికలాంగులకు 1500 రూపాయల నుండి 3 వేల 16 లకు వరకు, మిగిలిన 8 రకాల ఫించన్లు 1000 రూపాయల నుండి 2 వేల 16 లకు పెంచడం జరిగిందన్నారు.అసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 2019-20 ఆర్ధిక సంవత్సరమునకు 9 వేల 434 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇప్పటి వరకు 7 వేల 864 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 2020-21 కి 11 వేల 758 కోట్ల రూపాయలు కేటాయించామని సభకు వివరించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి అదనంగా 2 వేల 355 కోట్ల రూపాయల బడ్జెట్ ను 57 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వృద్ధాప్య పించను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పెంచడము జరిగినదని చెప్పారు. కాగా, వయసు నిర్ధారణ కోసం నియోజకవర్గ కేంద్రాల్లోనే స్క్రీనింగ్ జరిగే విధంగా ఆదేశాలుజారీ చేశామని సభ్యులకు వివరించారు.
Tags asara errabelli dayakar kcr PENSIONS slider telangana cmo telangana governament telanganacm trswp