స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. అయితే చంద్రబాబులా కాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్న వైసీపీ కరణం బలరాం లాంటి టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవడం లేదు..వల్లభనేని వంశీ, మద్దాలిగిరి తరహాలో కరణం బలరాంను కూడా స్వతంత్ర్యంగా వ్యవహరించమని కోరుతుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమకు తాము స్వతంత్ర్య ఎమ్మెల్యేలుగా చెలామణీ అవుతూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. గత 9 నెలలుగా ప్రభుత్వంపై చంద్రబాబు, ఎల్లోమీడియా ఎంతో దుష్ప్రచారం చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతున్న సీఎం జగన్కు సహనం నశించింది. తొలుత గ్రేటర్ రాయలసీమగా భావించే సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి తమ పార్టీలో చేరాలనుకునే టీడీపీ నేతలకు గేట్లు బార్లా తెరిచి ఉంచారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ ఇప్పటికే పలువురు టీడీపీ కీలక నేతలను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న వైసీపీ, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం తమవైపు తిప్పుకోగలిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో బాలయ్య సన్నిహితుడు కదిరి బాబురావు, కరణం బలరాం, కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే పాలేరు రామారావులు వైసీపీలో చేరగా ,ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవురావు, ఆయన తనయుడు సుధీర్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీ గూటికి చేరుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోయాయి.
. తాజాగా వైసీపీ అధిష్టానం విశాఖ జిల్లాపై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ ప్రభంజనం వీచినా ముఖ్యంగా ప్రకాశం, విశాఖ జిల్లాల్లో టీడీపీ పై చేయి సాధించింది. ఒక్క విశాఖ నగరంలోనే టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ తూర్పున వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమాన గణబాబు, దక్షిణాన వాసుపల్లి గణేష్, ఉత్తరాన గంటా శ్రీనివాస్ లు వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని గెలిచారు. దీంతో రాష్ట్రాన్ని గెలిచినా విశాఖను గెలవలేకపోయామన్న ఫీలింగ్ సీఎం జగన్ లో ఉండిపోయిందనే ప్రచారం కూడా ఉంది. అందుకే వైసీపీ విశాఖను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గంటా, వాసుపల్లిగణేష్, గణబాబులు వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి..కాని అవి ఫలించలేదు..ఇక వైజాగ్ను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల్లో ప్రధానంగా విశాఖలో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి జై కొట్టి మూడునెలలుగా రాజధాని గ్రామాల రైతులతో ఆందోళనలు నిర్వహించడంపట్ల టీడీపీపై వైజాగ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ తరుణంలో టీడీపీ నేతలు కూడా ప్రజల్లో తిరగలేకపోతున్నారు. ఈ పరిస్థితులలో విశాఖలో టీడీపీ అగ్రనేతలంతా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఇదే అవకాశంగా టీడీపీ కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తంగా కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో మొదలైన వలసలు త్వరలో విశాఖకు కూడా పాకే అవకాశం ఉంది. దీంతో వలసలను ఎలా ఆపాలో తెలియక చంద్రబాబు తలపట్టుకున్నాడు.