స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల్లో వైసీపీ అరాచకం చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవలో పవన్ మాట్లాడుతూ…తనలో ఉన్న పిరికితనంపై చిన్నప్పటి నుంచే పోరాడానని చెప్పుకొచ్చారు. .మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. మనలో ధైర్యం అనే కండ పెరగదంటూ పిరికితనంపై లెక్చర్ ఇచ్చాడు. అయితే చంద్రబాబు హయాంలో ఎన్ని అరాచకాలు జరిగినా కనీసం ప్రశ్నించలేని పవన్ పిరికితనంపై ప్రత్యర్థులు పలు సందర్భాల్లో విమర్శిస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ పవన్కల్యాణ్ పవన్ స్టార్ కాదని, ఆయనో పిరికిస్టార్ అని ఎద్దేవా చేశారు. కరోనా భయాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తే పవన్ అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితం ఒకటే వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు జరిగిందో అలాగే ఉంటుందని, మిగిలిన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పిన విషయాన్నిఈ సందర్భంగా అమర్నాథ్ గుర్తు చేశారు. ఇక పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో రెండు చోట్ల ఓడిపోయిన రికార్డు కూడా పవన్ పేరిట ఉందని ఎద్దేవా చేశారు.
అలాగే రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించాక అక్కడ భూ కబ్జాలు భారీ పెరిగిపోయానని , సాక్షాత్తూ విశాఖలో తన భూమినే కబ్జా చేశారని విమర్శలు చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కూడా అమర్నాథ్ మండిపడ్డారు. . విశాఖలొ నిజంగా భూకబ్జా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా అని కన్నాని సూటిగా ప్రశ్నించారు. త్వరలోనే టీడీపీలో చేరేందుకు కన్నా రూట్మ్యాప్ సిద్ధం చేసుకున్నారని, అందుకే విశాఖలో కబ్జా అంటూ టీడీపీ చేసిన విమర్శలనే కన్నా చేస్తున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. కాగా విశాఖలో కన్నా భూములు సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఇష్టం లేకనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీజేపీ తోక పార్టీలా మారిందని, దానికి జనసేన ఈక పార్టీలా మారిందంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదు…పిరికిస్టార్ అంటూ వైసీపీ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.