కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో మంత్రి కే. తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని ఫార్మా మరియు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ ఫార్మా ఇండస్ట్రీని ప్రభుత్వం అత్యవసర సేవారంగంగా గుర్తించిందని మంత్రి వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉన్న అవకాశాలపైన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి అవసరమైన మందులను ఉత్పత్తి చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. ఈ మందుల తయారీ ఉత్పత్తులు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి మరియు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పంపేంత సామర్ధ్యం కూడా ఇక్కడి కంపెనీలకు ఉన్నదని ఈ సందర్భంగా ఫార్మా ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్ధిస్థుల నేపథ్యంలో అత్యవసరం కానీ ఫార్మా ఉత్పత్తుల తయారీని తగ్గించి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కావాల్సిన ఉత్పత్తుల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదా ఇతర ప్రవేట్ సంస్థలకు కావాల్సిన సోడియం హైపోక్లోరైట్, బ్లీచింగ్ పౌడర్, హండ్ సానిటైర్ల ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. వీలైతే ఈ ఉత్పత్తులను ఫార్మా కంపెనీలు తమ సియస్సార్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల రక్షణ మరియు బాగోగుల పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ మరియు ఫార్మా ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నారు.