మేము యువకులం.. కరోనా మమ్మల్ని ఏమీ చేయదు’ అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రభుత్వం, వైద్యుల మాటలు పెడచెవిన పెట్టి ఇష్టారీతిగా తిరుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ నిర్లక్ష్యం కరోనా వైరస్ వ్యాప్తికి ఆసరాగా నిలుస్తున్నది. మన దేశంలో కరోనా కాటు యువతరంపైనే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏప్రిల్ 2వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 60శాతం కంటే ఎక్కువగా.. 20 నుంచి 49 ఏండ్ల వయస్సువారే ఉన్నారు. ఇందులో 20-39 మధ్య వారు 43%, 40-49 వయస్కులు 17% దాకా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియా టుడే డాటా ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, మన దేశంలో యువతకే కరోనా ఎక్కువగా సంక్రమిస్తున్నట్టు తెలుస్తున్నది. చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో కరోనా వైరస్ ఎక్కువగా పెద్ద వయస్సు వారికి సంక్రమిస్తుండగా.. మన దేశంలో యువతలో ఎక్కువగా కనిపిస్తున్నది. మన దగ్గర నమోదైన పాజిటివ్ కేసుల్లో వయోధికుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించవచ్చు. 60 ఏండ్లకు పైబడిన వారు 19 శాతం ఉండగా, 80 ఏండ్లు దాటిన వారు 2 శాతం కంటే తక్కువగా ఉన్నారు. ఇక 10 ఏండ్ల కంటే తక్కువ వయసున్నవారు 3 శాతం ఉన్నారు.
పాజిటివ్ కేసుల్లో పురుషులే అధికం
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం పురుషులు, 27 శాతం మహిళలు ఉన్నారు. మహిళల్లో కూడా యువతులే ఎక్కువగా ఉండటం గమనార్హం. పాజిటివ్ కేసులు నమోదైనవారి మహిళల్లో ఎక్కువగా 20 నుంచి 29 వయస్సువారు ఉన్నారు. పురుషులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.