కరోనా ఎలా సోకుతున్నది? ఏ విధంగా వ్యాపిస్తున్నది? ఎవరిని టార్గెట్ చేస్తున్నది? ఇదీ ఇప్పుడు అంతు చిక్కకుండా మారింది. హైదరాబాద్ శివారులోని బీరంగూడలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి ఏప్రిల్ 5వ తేదీన జ్వరం వచ్చింది. జలుబు కూడా ఉండడంతో ఓ కార్పొరేట్ దవాఖానకు తీసుకువెళ్లారు. కొన్ని మందులు వాడిన తర్వాత ఈనెల 9న మరోసారి జ్వరం వచ్చింది. అనుమానంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా ఆ బాలుడికి కరోనా ఉన్నట్టు తేలింది.
సోమవారం ఈ విషయం ధ్రువపడింది. అయితే ఇది ఎలా జరిగిందన్నదే ఇప్పుడు అంతుచిక్కడం లేదు. కుటుంబ సభ్యులతో కలసి ఆ బాలుడు జనవరి 20న జర్మనీ నుంచి తిరిగి వచ్చాడు. ఇది జరిగిన 70 రోజుల తర్వాత అతడిలో జ్వరం- జలుబు కనిపించాయి. బాలుడికి జర్మనీలోనే వైరస్ సోకిందా? ఒకవేళ అదే జరిగితే 70 రోజుల తర్వాత బయటపడుతుందా? అన్నది సందేహం. మరోవైపు ఆ బాలుడి తండ్రి ఫిబ్రవరి 24న స్విట్జర్లాండ్ వెళ్లి, మార్చి 17న రాష్ర్టానికి తిరిగొచ్చారు. అధికారులు ఆయనను కొండాపూర్లోని ఓ గెస్ట్హౌజ్లో 14 రోజులపాటు స్వీయనిర్బంధంలో (క్వారంటైన్లో) ఉంచారు.
మార్చి 31న పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 1న బీరంగూడలోని ఇంటికి పంపారు. తండ్రికి వ్యాధి లేదని నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు కొడుక్కి పాజిటివ్ ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షల్లో నెగిటివ్ చూపించినప్పటికీ, తండ్రి వైరస్ వాహకుడిగా మారారా? ఆయన నుంచే కొడుక్కి వైరస్ వచ్చిందా? అని డాక్టర్లు అనుమానిస్తున్నారు. అటు జర్మనీలో కాకుండా, ఇటు తండ్రి నుంచీ కాకుండా మరేదైనా మార్గంలో ఆ బాలుడికి వైరస్ సోకిందా? ఇక్కడికి వచ్చాక కుటుంబ సభ్యులు బయట తిరగడం వల్ల వైరస్ సోకిందా అనే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. మిగతా మార్గాలకన్నా, తండ్రి నుంచి సోకే అవకాశాలే ఎక్కువ అని అంచనా వేస్తున్నారు.
మార్చి 31న తండ్రికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ, అప్పటికి ఆయనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నందున కరోనా లక్షణాలు బయటపడలేదని, అదే సమయంలో ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన నుంచి కొడుక్కి వైరస్ సోకిందనీ భావిస్తున్నారు. మరోసారి పరీక్షిస్తే తండ్రిలో కూడా కరోనా వైరస్ బయటపడే అవకాశాలు ఉంటాయని నిపుణులు అనుమానిస్తున్నారు. అందుకే తండ్రికి మళ్లీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. బాలుడిని దవాఖానకు తరలించారు. ఈ కుటుంబంతో సన్నిహితంగా మెలిగినవారిని ఐసోలేషన్ కేంద్రాలకు పంపించారు. ఆ కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. అక్కడి ప్రజలు బయటకు వెళ్లకుండా అంక్షలు విధించారు. కాలనీలో పరిస్థితిని మంత్రి హరీశ్రావు సమీక్షించారు.