దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్-పాజిటివ్ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు వచ్చినవారికి, వారిని కలిసిన వారికి మాత్రమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తూ, క్వారంటైన్కు పంపుతున్నది.
కానీ వ్యాధి లక్షణాలు లేకుండానే వైరస్ను మోసుకొని తిరుగుతున్నవారు భారీ సంఖ్యలో ఉంటారని, వీరిని గుర్తించడం సవాలుతో కూడుకున్నదని డాక్టర్ గంగాఖేడ్కర్ హెచ్చరించారు. తాము పరీక్షలు నిర్వహించిన కరోనా రోగులలో నూటికి 20 మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపించాయని, మిగిలిన 80మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడలేదని ఆయన వివరించారు. వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంవల్ల వీరు తాము ఆరోగ్యంగా ఉన్నామన్న భావనతో బయట తిరుగుతూ ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ మరిన్ని రోజులు కొనసాగటం ఎంతో ప్రమాదకరమని, వీరివల్ల రోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నదని హెచ్చరించారు.
నిజానికి వైరస్లోనే ఆ వైవిధ్యమున్నదని అన్నారు. రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే దగ్గు, జ్వరం, జలుబు వంటి వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ నిర్మల్కుమార్ గంగూలీ చెప్పారు. వీరిలో కూడా వైరస్ సోకిన తరువాత ఐదు నుంచి 14 రోజుల మధ్య లక్షణాలు బయటకొస్తున్నాయని, ఈలోగా వీరు కూడా ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో 130 కోట్ల జనాభా ఉన్న భారత్లో వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వైరస్ బాధితులను గుర్తించేందుకు మరింత మెరుగైన విధానాన్ని అనుసరించాలని రమన్ తెలిపారు. లక్షణాలు కనిపించని వారిని గుర్తించడానికి కొత్త విధానమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలు, హాట్స్పాట్లలో ఇన్ఫ్లూయెంజా తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వైరస్ శరీర కణజాలంలోకి ప్రవేశించగానే తన సంఖ్యను పెంచుకుంటూ వేగంగా విస్తరిస్తున్నదని ప్రొఫెసర్ గంగూలీ చెప్పారు. రోగిలోని కణజాలమంతా విషపూరితం కాగానే రోగి మరణిస్తాడని తెలిపారు.
ఈ వైరస్ గాలిలో 3 నుంచి 4 గంటలపాటు క్రియాశీలంగా ఉంటుందని అన్నారు. తగినని వైరస్ పరీక్షలు నిర్వహించకపోవడం, పరీక్షల్లో నాణ్యత లేకపోవడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే కరోనా నియంత్రణకు మరో రెండేండ్లు పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.