ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ ఆర్ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్నూలులో కరోనా పాజిటివ్ వచ్చిన మరో వైద్యురాలి వద్దకు చికిత్సకోసం వెళ్లినవారికి కూడా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలా వైద్యంకోసం వెళ్లినవారు ఇంకా కొంతమంది ఉన్నట్టు సమాచారం ఉండటంతో వారికోసం అధికారులు గాలిస్తున్నారు.
మొత్తం ఐదుగురికి కర్నూలు నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో కర్నూలు నుంచి తెలంగాణకు వైరస్ వ్యాప్తి చెందినట్టు అక్కడి అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నారు.