దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది.
జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్తో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ అత్యున్నత సమీక్ష నిర్వహించారు.
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హరియాణా, గుజరాత్, జమ్ము కశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల అధికారులు ఇందులో పాల్గొన్నారు.