దేశ వ్యాప్తంగా రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు.
ఈ మేరకు ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020’ హ్యాష్ట్యాగ్ పేరుతో ట్విటర్, ఫేస్బుక్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
‘‘ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు రాబోయే విద్యాసంవత్సరానికి బోధనాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాం’’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు.
ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావచ్చని మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ సోమవారం సూచనప్రాయంగా తెలిపారు.