నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది.
దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్థానిక బీజేపీ నేత గిరీష్ మహాజన్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
మరోవైపు రోడ్డు ఎత్తును ఇటీవల పెంచడం వల్లనే వర్షం నీరు లోనికి వచ్చినట్లు దవాఖాన అధికారులు తెలిపారు. రోడ్డు ఎత్తును పెంచినప్పుడు ఈ విషయాన్ని పట్టించుకోలేదని వారు ఆరోపించారు.