తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మాదేవేందర్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్ పోలీసు స్టేషన్లో తెరాస నేతలు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పుడు పోస్టు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ పోస్టును మెదక్ జిల్లా రాజుపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసినట్లు గుర్తించారు. అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.