360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ..ఆయన మన తెలంగాణ ఠీవీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనం. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారు.
ఏ రంగంలో ఉంటే ఆరంగంలో సంస్కరణలు తెచ్చారు. విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చింది ఆయనే. ఆయన ఒక డిప్లొమాట్, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. సైన్స్, ఆస్ట్రానమీ రంగాల పట్ల కూడా పీవీకి చాలా ఆసక్తి ఉంది. 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే గొప్ప వ్యక్తి పీవీ. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకెళ్లాలి’’ అని కేసీఆర్ సూచించారు.
పీవీ రాజకీయ ప్రస్థానంలో కుల, ధన బలం పార్శ్వమే లేదని వివరించారు. కుల, ధన బలం లేకుండానే ఆయన.. సీఎం, ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. వాక్శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన గొప్ప వ్యక్తి అని సీఎం కొనియాడారు. నిరంతర విద్యార్థి.. అధ్యయనశీలి.. సామాజిక దృక్పథం గల వ్యక్తి అని పేర్కొన్నారు.
పీవీ ఆశయాల మేరకు రాష్ట్రంలో 900 గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని వెల్లడించారు. ఆయన శతజయంతి ఉత్సవాలు 51 దేశాల్లో జరుగుతున్నాయని కేసీఆర్ గారు తెలిపారు.