బక్రీద్ పండగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల పట్ల రాష్ట్ర డిజిపి శ్రీ ఎం.మహేందర్ రెడ్డి తో హోంశాఖా మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ శనివారం నాడు తన కార్యాలయం లో చర్చించారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని ముస్లీం సోదరులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటున్నామని అన్నారు. ఇదే తరహాలో బక్రీద్ పండగ జరుపుకోవాలన్నారు. ప్రసిద్ధి చెందిన చార్మినార్ లోని నాలుగు మినార్లు హిందూ,ముస్లీం,సిక్కు,క్రిస్టియన్ లుగా భావిస్తామని, ఈవిధంగా అన్ని మతాలను,కులాలను సమానంగా పరస్పరం గౌరవించుకుందాం అన్నారు. గోవులను హిందువులు పూజిస్తున్నందున ఎప్పటిలాగే వాటిని బలి ఇవ్వవద్దని కోరారు.
ఈ సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. తద్వారా ఇతరులకు హాని కలిగించకుండా వ్యర్థాలను రోడ్లు, వీధుల్లో పారవేయవద్దన్నారు. ప్రార్థనలు, జంతువుల అమ్మకం మరియు కొనుగోలు సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సురక్షితమైన దూరం పాటించాలని తెలిపారు.