తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నదని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.
కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపిన ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం ఉదయం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ ఈ అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కొవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయి.