ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్లూమ్ బోర్డును రద్దు చేసిందని.. ఈ బోర్డుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చేనేత నిపుణులు, ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారని లోకేష్ గుర్తు చేశారు. అయితే ఈ బోర్డులు తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి,సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేదన్నారు.
ప్రశ్నార్థకంగా మారింది..
‘చేనేత రంగంలో సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన,చేనేత రంగం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యం. నిరుద్యోగాన్ని తగ్గించి చేనేతను ఒక సమర్థవంతమైన వృత్తిగా మార్చడంలో ఈ బోర్డులు ఎంతగానో కృషి చేసాయి. దేశ, విదేశాల్లో చేనేతల మార్కెట్లను విస్తరించడానికి ప్రణాళికలు రచించడం ఈ బోర్డుల ఉద్దేశ్యం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు,చేనేత యూనియన్ల అభివృద్ధి చర్యలను సమర్థవంతంగా బోర్డులు సమన్వయం చేసేవి. ప్రభుత్వానికి-చేనేతల మధ్య ఉన్న ఏకైక వారధి అఖిల భారత చేనేత బోర్డు. నేతన్నకు అండగా నిలిచిన బోర్డులు రద్దు చెయ్యడం వలన చేనేత రంగం ఉనికి ప్రశ్నర్ధకంగా మారింది’ అని లోకేష్ తెలిపారు.
నా బాధ్యతగా లేఖ రాశా..
‘కరోనా కారణంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది సంక్షోభంలో కూరుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం అమలులో విఫలమైంది. 10 శాతం మందికి మాత్రమే ఈ పథకం అందుతుంది. కేంద్రం 3బోర్డులను రద్దు చేయటం చేనేత, హస్తకళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రంగాల పునరుద్ధరణకు ఇప్పటికే కేంద్రానికి నా వంతుగా లేఖ రాశాను. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్లూమ్ బోర్డుల పునరుద్ధరణకు పోరాడుతుందని ఆశిస్తున్నాను’ అని లేఖలో లోకేష్ పేర్కొన్నారు.