కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసినా.. కేంద్రం రైతుల గుండెల్లో బాంబులు వేస్తున్నదన్నారు. తెలంగాణలో మక్క లు బాగా పండాయని, 35 శాతం ధర తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే, దేశంలో పండించిన మక్కజొన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు.
ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, ఎక్కడైనా ఉచితంగా కరెంట్ ఇచ్చారా?, ఇంటింటికీ తాగునీరు అందించారా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ సహకారంతో దుబ్బాక నియోజకవర్గ ప్రజల తాగునీటి గోస తీరిందన్నారు. త్వరలోనే 100 పడకల దవాఖానను వినియోగంలోకి తెస్తామన్నారు. కొత్తగా పీఎఫ్ వచ్చిన బీడీ కార్మికులకు జీవనభృతి అందిస్తామని హామీఇచ్చారు.