‘నేను తిరిగి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి.
దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు.
ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్న రాహుల్ను పోలీసులు అడ్డుకున్న తీరు బాధాకరమన్నారు.
2009లో ప్రధాని కావాలనుకుంటే అయ్యేవారని.. కానీ మరింత అవగాహన కోసం ఆ పదవిని వదిలేశారని చెప్పారు. బీజేపీ దళిత వ్యతిరేక, వ్యాపారులు, కార్పొరేట్ల పార్టీ అని విమర్శించారు.
సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడంలేదని, ఎప్పుడూ తన కేసుల మాఫీ గురించి కేంద్రం కాళ్లు పట్టుకోవడానికే ఆయనకు సమయం సరిపోతోందని ఎద్దేవాచేశారు.
వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి దళితులపై దాడులు జరుగుతున్నాయని, దాడి చేసేవారిని ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు.