పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు.
ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతి నగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు మంత్రి పువ్వాడ బతుకమ్మ చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 317 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తుందని, తొలుత 8 డిజైన్లతో ప్రారంభించి 287 విభిన్నమైన డిజైన్స్ లలో బంగారు ,వెండి జేరి అంచులతో తయారీ చేయబడిన పాలిస్టర్ పిలిమెంట్ నూలు చీరెలు అందిస్తున్నారన్నారు.
తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి నేడు ఉపాధి లభించిందని పేదలు, కార్మికుల పట్ల చిత్తశుద్ధి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు. అనేక వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
మహిళలందరికి పెద్దన్నగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండి, తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి ఆయా చీరలు అందిస్తున్నారని చెప్పారు.