నిరుపేదలైన ఎస్సీలకు రైతుబంధు, బీమాలకు ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ఎస్సీల ప్రత్యేక నిధి,ఉప ప్రణాళికల ద్వారా అమలవుతున్న పథకాలు,కొత్తగా ప్రవేశపెట్టాల్సిన కార్యక్రమాల గురించి సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు.
ఎస్సీల సర్వతోముఖాభివృద్ధికి మరింత మెరుగైన ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.అసెంబ్లీ కమిటీ హాల్లో ఎస్సీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సెప్టెంబర్ లో,ఆ తర్వాత అధికారులతో జరిపిన చర్చలకు కొనసాగింపుగా మంత్రి ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిరుపేదలైన వారందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.ఎస్సీల ఇండ్లలో మీటర్లను బిగించడం ద్వారా 100శాతం విద్యుధీకరణ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎస్సీల నివాస ప్రాంతాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు రోడ్లు వేయాలని, బర్రెల పంపిణీ ద్వారా ఉపాధి అవకాశాలను మరింత పెంపొందించవచ్చని మంత్రి చెప్పారు.
తాను సూచించిన, సమావేశంలో చర్చించిన అంశాలన్నింటినీ క్రోడికరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు గాను తగు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సంబంధిత ఉన్నతాధికారులు యోగితారాణా, కరుణాకర్, హన్మంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.