బిహార్ ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని ఎన్డీయేకు ఓటెయ్యాలని కోరారు. ‘బిహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రగతి పథంలో నడిచే ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధరించడానికి అభివృద్ధి పథకాలు నిలిచిపోకూడదు. దానికి బిహార్లో నితీశ్కుమార్ ప్రభుత్వం అవసరం’ అని మోదీ రాసిన లేఖను ఆయన ట్వీట్ చేశారు.
భాజపా ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, బిహార్లో జేడీయూ- భాజపా ప్రభుత్వాలను రెండు ఇంజిన్ల శక్తిగా పేర్కొన్న మోదీ.. దీని వల్ల రానున్న దశాబ్దకాలంలో బిహార్ అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను చేరుకుంటుందని వివరించారు. బిహార్ ప్రజలు కులం పేరుతో ఓట్లు వేయొద్దని.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ప్రజలు శాంతి భద్రతలకు, నిజాయతీకి, స్వావలంబనకు ఓటు వేస్తున్నట్లు మోదీ లేఖలో పేర్కొన్నారు.
2005 నుంచి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ బిహార్లో అభివృద్ధి జరగలేదని మోదీ లేఖలో పేర్కొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో తాము అభివృద్ధిని సృష్టించామని ప్రధాని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు శాంతిభద్రతల నిర్వహణ సమర్థంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మోదీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే ఈ రెండింటిని అందించగలదని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.