హైదరాబాద్ మహానగరంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడ్డాయి. ఒక్కరోజే 30 సెంటీమీటర్లు కూడా పడ్డరోజులున్నాయి. కాలనీలకు కాలనీలే నీళ్లలో ఉన్నాయి. పాపం కొంత మంది ఇండ్లలో బియ్యం, ఉప్పు, పప్పు కూడా తడిచిపోయింది. పిల్లల స్కూళ్ల సర్టిఫికెట్లు కూడా తడిసిపోయినయ్. వాళ్లను చూస్తే నాకు చాలా బాధనిపించింది. కొందరి ఇండ్లలో మంచం మునిగేంత నీళ్లు.. వాళ్ల బాధలు వర్ణనాతీతం.
చాలా చోట్ల నిరుపేదలే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లను ఆదుకోవడం మన బాధ్యత అనిపించింది. నన్ను ఎవరూ అడగకపోయినా వరద బాధితుల కోసం ప్రతి కుటుంబానికి పదివేలు ఇవ్వాలని నిర్ణయించిన. సీఎంఆర్ఎఫ్లోని నిధుల నుంచి 550 కోట్లను దీనికోసమే కేటాయించిన. దీంట్లో 50 కోట్లు తక్షణ మరమ్మతులకు కేటాయించాం. మిగిలిన 500 కోట్లను వరద బాధితులకు ఇవ్వాలని సీఎస్ గారిని కోరిన.
అయిదులక్షల కుటుంబాల వరకు నష్టపోయినట్టు అధికారులు అంచనావేశారు. అందరికీ సహాయం ఇవ్వాలనుకొన్నాం. అవసరమైతే ఇంకో రెండుమూడు వందల కోట్లు దీనికోసమే కేటాయించాలని భావించాం. మీ సేవా కేంద్రాల్లోనే 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లక్షా 67 వేల మందికి మనం ఇప్పటికే సహాయం అందించాం. కానీ, ఎన్నికల సంఘం ఇప్పుడు దీన్ని ఆపాలని చెప్పింది. దీనికి కూడా బీజేపీనే కారణం అని టీఆర్ఎస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
.