కోవిడ్-19ను ఎదుర్కొనే దిశగా భారత్లో ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు నీతి ఆయోగ్(హెల్త్) సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మంగళవారం ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ వారంలో మరో వ్యాక్సిన్కు క్లినికల్ ట్రయల్స్కు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
జెనోవా కంపెనీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఫైజర్స్ వ్యాక్సిన్ తయారీకి వినియోగించిన టెక్నాలజీనే ఈ వ్యాక్సిన్ తయారీకి వినియోగించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ను మామూలు ఫ్రిజ్ల్లో కూడా నిల్వ ఉంచుకునే విధంగా తయారుచేసినట్లు తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కుటుంబఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ను నిల్వ చేసి, పంపిణీ చేసే నిమిత్తం 29,000 కోల్డ్ చైన్ పాయింట్స్, 240 వాక్-ఇన్ కూలర్స్, 70 వాక్-ఇన్ ఫ్రీజర్స్, 45000 ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్స్, 41,000 డీప్ ఫ్రీజర్స్, 300 సోలార్ రిఫ్రిజిరేటర్స్ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరికరాలు ఇప్పటికే రాష్ట్రాలకు చేరుకున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.