ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పాత్ర మరువలేనిది. శుబ్మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు.
నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. ఈరోజు పంత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రతి భారత అభిమాని మదిలో కొన్నేళ్ల పాటు నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
కాగా నాలుగో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన పంత్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘నా కల నిజమైంది. నేను ఫామ్లో లేని సమయంలో టీమ్ నాకు మద్దతుగా నిలిచింది. తొలి టెస్ట్ తర్వాత నెట్స్లో చెమటోడుస్తున్నాం. టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ నాకు అండగా ఉంది. నేనో మ్యాచ్ విన్నర్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది’అని పంత్ అన్నాడు.