మద్యం మత్తులో బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి దిగాడు. రాత్రి 9 గంటలకు మహిళల ఇంటికెళ్లి మరీ వేధించాడు. అసభ్య పదజాలంతో మహిళలను సమీర్ దూషించాడు.
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడని బాధితులు చెబుతున్నారు. సమీర్తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐదు లక్షల రూపాయిలు నగదు అప్పుగా తీసుకుని.. డబ్బులివ్వమని అడిగితే రౌడీయిజం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. సమీర్ నుంచి తమకు ప్రాణహానీ ఉందని మహిళలు పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళలిద్దరూ తమ దగ్గర సమీర్ డబ్బులు తీసుకున్నాడని చెబుతుండగా ఆయన మాత్రం మరోలా చెబుతున్నాడు.