తెలంగాణ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ధీమా పెంచామని, ఇప్పటికే రైతుబంధు కోసం రూ.14,500 కోట్ల నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు.
బుధవారం సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు.
ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,500 రైతు వేదికలకు రూ.600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతులు పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరెంట్ సమస్య అన్ని వర్గాలను వేధించిందని, నాడు కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్ల్లతో రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
నాడు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పి ముక్కుపిండి బిల్లులు వసూలు చేశారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేస్తున్నారని తెలిపారు.
647 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు వందశాతం పూర్తిచేసిన జిల్లాగా సంగారెడ్డి నిలవడం సంతోషకరమని అధికారులను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.