తెలంగాణ రాష్ట్రంలో పాలకొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున బర్రెలు, ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి పథకం ద్వారా సుమారు రూ.800 కోట్ల రుణాలతో రెండేండ్లలో పాడిరైతులకు లక్ష బర్రెలు, ఆవులు అందించనున్నది. ఇప్పటికే 14 వేల బర్రెలు, ఆవుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించింది.
రుణాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50వేల యూనిట్లను పాడిరైతులకు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. కరోనా ప్రభావంతో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పటివరకు 14,476 బర్రెలు, ఆవులను అందించారు. ఇతర రాష్ర్టాల నుంచి అధికంగా పాలిచ్చే ముర్రా, సంకరజాతి వాటినే కొనుగోలు చేయాలని షరతు విధించారు. వీటికి గోపాలమిత్ర, పాలమిత్రల ద్వారా ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు.
ఒక్కో కుటుంబానికి రెండు బర్రెలు, ఆవులను కొనుగోలు చేయడానికి రుణం అందిస్తారు. లబ్ధిదారుడికి ఇష్టమైన రాష్ట్రం నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛనిచ్చారు. ఒక బర్రెను కొనుగోలుచేసిన నాలుగైదు నెలల తర్వాత మరొకటి కొనేందుకు రుణమిస్తారు. దీంతో ఏడాది మొత్తం పాడిని పొంది రైతులు రుణాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. పాడిరంగంలో అనుభవం ఉన్న రైతులకు నాలుగు బర్రెలు, ఆవులకు కూడా రుణం అందిస్తారు.
ఒక్కో బర్రె కొనుగోలుకు రూ.75 వేలు, రెండు నెలలకు సరిపడా దాణాకు రూ.7,200, కొనుగోలు చేసే సమయంలో రవాణాకు రూ.3 వేలు, రవాణా సమయంలో బర్రె ఇన్సూరెన్స్కు రూ.443, తర్వాత ఇన్సూరెన్స్కు (4ఏండ్లదాకా) రూ.5,088 కలిపి మొత్తంగా రూ. 90,731 చెల్లిస్తారు. ఈ రుణాన్ని 11.5శాతం వడ్డీకే అందజేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశాక ఇక్కడి వాతావరణంలో మృతిచెందే ప్రమాదం కూడా ఉంటందనే పాడిరైతుల భయాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగేండ్లపాటు ఇన్సూరెన్స్ కల్పించారు. రుణం తీసుకున్నాక మూడోనెల నుంచి నెలకు రూ.2,524 చెల్లించాల్సి ఉంటుంది.