తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం అని పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా.. నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. 2014-15లో సాగు విస్తీర్ణం కోటి 41 లక్షల ఎకరాలు కాగా, 2020-21 ఏడాదిలో 2 కోట్ల 10 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. అదే విధంగా పంటల ఉత్పత్తి 2014-15లో 2 కోట్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు నమోదు కాగా, 2020-21లో రికార్డు స్థాయిలో 4 కోట్ల 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పంటల ఉత్పత్తి రెట్టింపు అవుతోందన్నారు.
పత్తి సాగులో రికార్డు
పత్తి సాగులో తెలంగాణ రాష్ర్టం రికార్డు సృష్టించింది. 60 లక్షల 54 వేల ఎకరాల్లో పత్తిని సాగు చేయడంతో, దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ర్టంగా తెలంగాణ అవతరించిందని పేర్కొన్నారు. వరి ధాన్యం సేకరణలోనూ తెలంగాణ రాష్ర్టం దేశంలోనే రెండో వరుసలో నిలిచిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 10,500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రికార్డు సమయంలో కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును చాలా వరకు పూర్తి చేసి గోదావరి నీళ్లతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహం
భారతదేశం సంవత్సరానికి రూ. 70 వేల కోట్ల విలువ గల పామాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. పామాయిల్కు అంతర్జాతీయ డిమాండ్ ఉండటమే కాకుండా, ఈ పంట సాగు వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. దీంతో తెలంగాణ రైతుకు ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులకు అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ర్టంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగుకు కావాల్సిన ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు.
2,601 రైతు వేదికలు
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమావేశాల కోసం.. రూ. 572 కోట్ల 22 లక్షల ఖర్చుతో 2,601 రైతు వేదికలను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. పంట ఆరబెట్టుకునేందుకు రూ. 750 కోట్లతో లక్ష మంది రైతులకు వారి పొలాల వద్దే కల్లాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో మరే ప్రభుత్వం కూడా కల్లాలను నిర్మించడం లేదన్నారు.
ఐదేండ్లలో 14,644 ట్రాక్టర్ల పంపిణీ
వ్యవసాయ రంగంలో నేడు మానవ వనరుల కొరత వల్ల యాంత్రీకరణ అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన అధునాతన యంత్రాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. గత ఐదేండ్లలో ప్రభుత్వం 14,644 ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందజేసిందని చెప్పారు. రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు, పరికరాల కోసం ఇప్పటి వరకు రూ. 951 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో రూ. 1500 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
రైతు బంధుకు రూ. 14,800 కోట్లు
రైతు బంధు పథకం కింద 2021 వానాకాలం, యాసంగిలో 59 లక్షల 25 వేల 725 మంది రైతులకు రూ. 14,736 కోట్లను అందించిందని తెలిపారు. గడిచిన మూడేండ్లలో రైతుబంధు పథకం కింద రూ. 35,911 కోట్లను అందించగా, ఇందులో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే అని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో రైతుబంధు పథకం కోసం రూ. 14,800 కోట్లు కేటాయించారు. రైతుల రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు కేటాయించారు. త్వరలోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతుబీమా పథకానికి చేసిన కేటాయింపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1200 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు