తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్లు, 3 ఆర్వోబీలను పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు.
కరోనా లాక్డౌన్లో రూ. 2 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవర్లు, 300 కి.మీ. రోడ్లు, 29 లింకురోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరానికి కొత్త అందాన్ని తెచ్చి పెట్టిందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ మధ్య దూరం తగ్గిందని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు 179 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ప్రతీ రోజు 55 వేల మందికి రూ. 5కే చక్కటి భోజనం అందిస్తున్నామని తెలిపారు.
మూసీ నది పునరుజ్జీవం కోసం, మూసీ పరిసరాల సుందరీకరణ కోసం రూ. 200 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. వెయ్యి కోట్లు, ఓఆర్ఆర్ పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం రూ. 250 కోట్ల నిధులను ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. వరంగల్ కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు రూ. 150 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ బడ్జెట్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 15,030 కోట్లు ప్రతిపాదించారు