సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హన్మకొండలో డీసీసీ బ్యాంకు పాలకవర్గం సభ్యుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, టీఏస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, రెడ్యా నాయక్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. వరంగల్ డీసీసీ బ్యాంకు అభివృద్ధిలో దూసుకుపోతుందన్నాడు. రూ.1100 కోట్లు టర్నోవర్ తో రూ.6 కోట్ల 90 లక్షల లాభాలు సాధించామన్నారు. రెండు నెలలల్లో కొత్తగా ఎనిమిది బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. గతంలో లోన్లు రికవరీ కాకపోవడానికి కారణం నీళ్లు- కరెంటు లేకపోవడమేన్నారు.
పంటలు పండకపోవడంతో రైతుల లోన్లు సకాలంలో కట్టలేకపోయారన్నారు.గతంలో సొసైటీ ఛైర్మన్లు ఇష్టారీతిన లోన్లను ఇచ్చారని, ఉద్యోగులను బెదిరించి లోన్లను పొందేవారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. అందుకే సొసైటీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పని చేసి వరంగల్ డీసీసీ బ్యాంకును అభివృద్ధి పథాన పయనించే విధంగా పాటుపడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.