తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతుందని పాడిన పాటను, కేసీఆర్ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేస్తూ పట్టణ ప్రజలకు అందిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువుపై గ్లోగార్డెన్ను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోమటి చెరువును పర్యాటకంగా తీర్చిదిద్ది ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం కోమటి చెరువుపై మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అంతకుముందు సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై బక్రిచెప్యాల టీ జంక్షన్ వద్ద మూడో పట్టణ పోలీస్ స్టేషన్ను సీపీ జోయల్ డెవిస్, అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి హరీశ్రావు ప్రారంభించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా ఉన్నదని, రాష్ట్రం ఏర్పడ్డాక పేకాట, గుడుంబాను పూర్తిగా నిర్మూలించినట్టు తెలిపారు. దేశంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కొవిడ్ కష్టకాలంలో జీవనభృతి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.