తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. కూరగాయలు మొదలు ఉచిత పాఠ్యపుస్తకాల వరకు అన్నింటినీ కార్గో ద్వారా జిల్లాలకు రవాణాచేస్తున్నారు. టీఎస్ ఫుడ్ ఆధ్వర్యంలో తయారవుతున్న బాలామృతం కిట్లు కూడా జిల్లాలకు కార్గోలో రవాణాచేస్తున్నారు. అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. బాలామృతాన్ని 9 నెలల నుంచి ప్రతిరోజూ దాదాపు 40 టన్నుల వరకు కార్గో ద్వారా విజయవంతంగా రవాణాచేస్తున్నారు.
ఇందుకు 10 నుంచి 15 కార్గో బస్సులను నడుపుతున్నారు. నెలలో 20 రోజులు రవాణా జరుగుతుండటంతో ప్రతినెలా 800 టన్నుల బాలామృతాన్ని జిల్లాలకు రవాణా చేస్తున్నామని ఆర్టీసీ కార్గో ఇంచార్జి కృష్ణకాంత్ తెలిపారు. దీంతో ప్రతి నెలా ఆర్టీసీకి సుమారు రూ.35 లక్షల వరకు ఆదా యం సమకూరుతున్నదని చెప్పారు.
మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొత్తగా 500 టన్నులకు సంబంధించిన విజయ బ్రాండ్ నూనె ప్యాకెట్లు జిల్లాలకు రవాణా చేయడానికి ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ప్యాకెట్లు కూడా అంగన్వాడీ కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు వస్త్ర వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్ నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండల కేంద్రాలకు చేరవేయడానికి ఆర్టీసీ కార్గో సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. త్వరలోనే పౌరసరఫరాల శాఖ, ఆబ్కారీశాఖకు సంబంధించిన రవాణా చేయడానికి సంప్రదింపులు కొనసాగుతున్నట్టు సమాచారం.