నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్.. 10 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు.
అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలో సకల సదుపాయాలతో సిద్ధం చేసిన చిన్నపిల్లల వార్డును కేటీఆర్ ప్రారంభించారు. పట్టణంలోని బస్ డిపో ఎదురుగా రూ.6 కోట్లతో చేపడుతున్న వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు.
జిల్లా కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అమరవీరుల స్తూపం పనులను ప్రారంభించారు. అనంతరం సింగారం క్రాస్ రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం.. అంబేడ్కర్ చౌరస్తా పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత పిల్లల పార్కు, సైన్స్ పార్కులను ప్రారంభించారు.