అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మునుగోడు మండల కేంద్రంలో రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్.. అద్భుతమైన పరిపాలన చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని చెప్పారు.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులే ప్రకటించారని, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని ప్రకటించారు.
జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశామని, ఇంటింటికి సురక్షిత నది జలాలను అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత ఆకలిని పారద్రోలామని సగర్వంగా చెప్తున్నామని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు.