సిరిసిల్ల అపరెల్ పార్కులో గోకల్దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అపరెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ…
2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అపరెల్ పార్కు పెడుతామని మాటిచ్చారు. కానీ అమలు చేయలేదు. సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ దానికి బీజం పడింది. సిరిసిల్ల ప్రజల కల నెరవేరింది. ఈ పార్కులో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉపాధి పొందబోతున్నారు. 80 శాతానికి పైగా మహిళలకే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బతుకమ్మ చీరలు, గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో నేతన్నల ఆదాయం పెరిగింది అని కేటీఆర్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యాక్టరీల ఏర్పాటు..
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే బట్టలు అంతర్జాతీయ మార్కెట్కు వెళ్తాయి. అందుకే ఆ స్థాయిలో ఈ ఫ్యాక్టరీలను డెవలప్ చేస్తున్నారని చెప్పారు. ఈ పార్కులో వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. బేబీ కేర్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ 60 ఎకరాల్లో రాబోయే రోజుల్లో రెండు, మూడు ఫ్యాక్టరీలు వరుసగా రాబోతున్నాయి. రాబోయే 6 నెలల్లో గోకల్దాస్ కంపెనీ ప్రారంభం కాబోతుంది అని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అత్యధికంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ చెప్పారు. అయితే ఇప్పటికే చాలా మంది మహిళలు శిక్షణ కూడా పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పత్తి పండించడంలో తెలంగాణ నంబర్ వన్..
భారతదేశంలోనే అత్యధికంగా పత్తి పండిస్తున్న రాష్ర్టంగా తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది అని కేటీఆర్ చెప్పారు. అత్యుత్తమైన, నాణ్యత గల పత్తి తెలంగాణలో దొరుకుతుందని సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వారు చెబుతున్నారు. మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దక్కాలనే ఆలోచనతో తెలంగాణ టెక్స్ టైల్, అపెరల్ పాలసీని తీసుకొచ్చామన్నారు. ఈ పాలసీలో భాగంగా దేశంలోని ప్రముఖమైన టెక్స్ టైల్ సంస్థలను కలిశాం. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ అనే సంస్థ 300 ఎకరాల్లో పెట్టుబడులు పెడుతుందన్నారు. దీంతో 12 వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. కేరళకు చెందిన కిటెక్స్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వరంగల్కు తరలివచ్చింది అని కేటీఆర్ గుర్తు చేశారు.