తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియాలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా జానారెడ్డిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు. 2 ఏండ్లలో కరెంట్ వ్యవస్థను మంచిగా చేసి.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పితే జానారెడ్డి ఎగతాళి చేసిండు.
రెండేండ్లు కాదు 20 ఏండ్లు అయినా పూర్తి చేయలేరు అని జానారెడ్డి మాట్లాడిండు.ఒక వేళ రెండేండ్లలో పూర్తి చేస్తే తాను గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పిండు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు.
కలలో కూడా ఊహించనటువంటి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ జిల్లాలో ఏర్పాటు అవుతుందన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే అతి పెద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటవుతుందన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలకు ఇది గర్వకారణం అని సీఎం కేసీఆర్ తెలిపారు.