కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకుంటే, అంత త్వరగా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ సూత్రాన్ని తెలంగాణ సర్కారు పక్కాగా అమలు చేసింది.
జనవరి 16 నుంచి ఇప్పటి వరకు తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 51 శాతానికి చేరింది. వ్యాక్సిన్ తీసుకోని 25 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉన్నట్టు సీరో సర్వే ఇటీవల వెల్లడించింది.
మొత్తంగా 76 శాతం మందికి కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. 2.20 కోట్ల మందికి టీకాలు వేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే కోటి 12 లక్షల మందికి తొలి డోసు, 33 లక్షల మందికి రెండో డోసు పూర్తి చేసింది.