దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి మృతి తీరనిలోటన్నారు.
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ పేదల సంక్షేమం కోసం పరితపించిన నేత సోలిపేట అని కొనియాడారు. సీఎం కేసీఆర్కు నమ్మినబంటుగా సోలిపేట ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోలిపేట జర్నలిస్టుగా, విప్లవకారుడిగా, ఉద్యమకారుడిగా, నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు.
సోలిపేట మృతి దుబ్బాక కే కాకుండా తెలంగాణకు తీరని లోటు అన్నారు. ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి సాధ్యమని అక్షరాల నిరూపించారని గుర్తు చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పూర్వ వైభవం తిరిగి తీసుకువస్తేనే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన సూచించారు