తెలంగాణలో ఇటీవల కొత్తగా వచ్చిన వైఎస్ఆర్టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో ఆమె తెలియజేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలను ప్రకటనలో నిశితంగా ఇందిరాశోభన్ రాసుకొచ్చారు.
కీలక నిర్ణయం తీసుకున్నా..!
‘నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం.. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.