ఇదీ బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా పెదవి విప్పడు. పదవి నుంచి తీసేయగానే.. సమిష్టి బాధ్యతను కూడా మరిచి.. తాను ఆమోదించిన వాటినే తీవ్రస్థాయిలో తప్పు పడతాడు గతంలో అధికారంలోకి వస్తదనే టీఆర్ఎస్లో చేరాడు. తనది లెఫ్ట్ సిద్ధాంతమని పదే పదే చెప్పుకొన్నాడు. తన డీఎన్ఏలోనే లౌకికవాదమున్నదని చెప్తాడు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తదని భ్రమపడి అందులో చేరిపోతాడు. నిన్నటిదాకా దళితబంధు సాధ్యమే కాదన్నాడు. ఇప్పుడేమో.. అందరి ఖాతాల్లో వేయాలని డిమాండ్లు చేస్తాడు. సంక్షేమ పథకాలన్నీ పరిగె ఏరుకొన్న చందమే అన్న నోటితోనే అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనీ అనగలడు. రాష్ట్రంలో అనేకమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తే డబ్బులిస్తారు. తాను ఆర్థిక మంత్రిగా ఉండికూడా పైసలు తెచ్చుకోకుండా.. హుజూరాబాద్ వెనుకబాటుకు బాధ్యత వహించడు. ఈటల మాట.. రాజకీయ ఆట ఏ రకంగా ఉన్నాయో ఇంతకుమించి నిదర్శనం కావాలా?
18-8-2021
నాలుగేండ్లలో రాష్ట్రమంతా దళితబంధు అంటున్నాడు. ఈ హామీ ఎవరిని మోసం చేసేందుకు? నాలుగేండ్లు కాదు.. 40 ఏైండ్లెనా దళితులందరికీ ఇచ్చేంత డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేశాను. నాకు బడ్జెట్ గురించి తెలుసు. ఇప్పుడు హుజూరాబాద్లో గెలవడానికి ఉడుముల మూతికి తేనె రాసినట్టుగా దళితబంధు అంటున్నాడు. దళితుల ఓట్లు కొల్లగొట్టి నా గొంతు పిసికేందుకే ఈ పథకం తెచ్చాడు.
19-8-2021
నా రాజీనామా వల్లనే ఇన్ని ఫలితాలు వస్తున్నందుకు గర్వంగా ఉన్నది. దళితబంధు విషయంలో మనకే పేరు వస్తుంది తప్ప కేసీఆర్కు కాదు. నోటిఫికేషన్కు ముందే దళితులందరికీ పది లక్షలు అకౌంట్లలో వేయాలి. ఎవరి అజమాయిషీ లేకుండా వాళ్లు స్వేచ్ఛగా డబ్బులు ఖర్చు
చేసుకొనే అవకాశమివ్వాలి. రైతుబంధు ఇచ్చినట్టుగానే దళితబంధును రాష్ట్రమంతా దళితబిడ్డలకు ఇవ్వాలి. సంచారజాతులు, అన్ని వర్గాల్లోని నిరుపేదలకు కూడా పది లక్షల చొప్పున ఇవ్వాలి. ఆకలికేకలు లేని, సుసంపన్న రాష్ట్రం కావాలంటే.. అందరికీ ఫలాలు దక్కాలి.
22-3-2021
పరిగె ఏరుకొంటే రాదు.. పంట పండితే వస్తది. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు పరిగె ఏరుకొన్నట్టే. నేను ఇబ్బంది పడ్డా, గాయపడినా మనసును మార్చుకోను.
16-8-2021
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందివ్వాలి. గొల్ల కుర్మలందరికీ గొర్రెలివ్వాలి. దళితబంధు పేదలకు ఇవ్వాల్సిందే. అనేక కుల వృత్తులు ఆగమయ్యాయి. వారిని కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయించాలి.
19-8-2021
రాజకీయాల్లో లెఫ్ట్, రైట్ అంటూ భావాలు ఏవీ స్థిరంగా ఉండవు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ అని నమ్మాను కాబట్టే ఇందులో చేరాను. బీజేపీ జెండాలు కట్టినా, ప్లెక్సీలు పెట్టినా పీకేస్తున్నారు.
హుజూరాబాద్లోఎగిరేది కాషాయజెండానే.
12-06-2021
నేను లౌకికవాదిని. నా డీఎన్ఏ అంతా లెఫ్ట్.. నా డీఎన్ఏ లోనే లౌకికవాదం ఉన్నది. కానీ లెఫ్టూ రైటూ కాదు.. ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక్క లక్ష్యంగా రైట్ పార్టీలో చేరుతున్నా. ఇవాళ నేను సరైన పార్టీలో చేరుతున్నా. మళ్లీ గెలిచి చూపిస్తా.