పరిశ్రమల ఏర్పాటుకు వెనువెంటనే అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్ ఐ-పాస్.. కరెంటు కోత అన్న పదమే వినపడకుండా పరిశ్రమలకూ 24 గంటలు సరఫరా.. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పారిశ్రామికరంగానికి నవశకం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్వేర్ పార్కులు, ఐటీ టవర్లు, మెగా ఉత్పత్తి పరిశ్రమలు తరలివచ్చాయి. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలు వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్నేహా, పోకర్ణ ఇంజినీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్ వంటివి తమ ప్లాంట్లను నెలకొల్పాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఏడేండ్లలోనే జిల్లాకు 21,507 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 3,647 పరిశ్రమలు ఏర్పాటయ్యా యి.
ఇప్పటివరకు 3,32,705 మందికి ఉపాధి దొరికింది. టీఎస్-ఐపాస్ విధానం అమల్లోకి వచ్చాకే జిల్లాకు రూ.19,028 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా గత ఏడేండ్లలో రూ.670 కోట్ల పెట్టుబడులతో 2,277 సూక్ష్మ తరహా పరిశ్రమలు, రూ.2,689 కోట్ల పెట్టుబడులతో 1,168 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 105 పెద్ద తరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,566 కోట్ల పెట్టుబడులు, 63 మధ్యతరహా పరిశ్రమలతో రూ.1,112 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. జిల్లావ్యాప్తంగా రూ.3,971 కోట్ల పెట్టుబడులతో 11 మెగా ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.9,765 కోట్ల పెట్టుబడులతో జిల్లాకు 33 మెగా ఇన్ఫ్రా(ఐటీ టవర్స్) ప్రాజెక్టులు వచ్చాయి. పారిశ్రామికరంగం అభివృద్ధితోపాటు ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. జిల్లాలోని చిన్న, మధ్య, భారీతరహా పరిశ్రమలతో 3,32,705 మందికి ఉపాధి లభించింది.