దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్ కార్డు, ఆధార్కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు, ప్రస్తుతం చేస్తున్న పని గురించి వాకబు చేశారు. దళితబంధు కింద ఏ యూనిట్ ఎంచుకుంటారు..?, ఏం చేస్తారు..?, ఆర్థికంగా ఎలా ఎదుగుతారు..? అని అడిగారు. దళితబంధు బ్యాంకు ఖాతాల కోసం ఫొటోలు, ఆధార్కార్డులను సేకరించారు.
దళితులతో మమేకమై..
5 మండలాలు.. 154 బృందాలు
హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో దళితబంధు సమగ్ర సర్వే ప్రారంభమైంది. ఇందుకోసం 39 మంది క్లస్టర్ స్థాయి అధికారుల (జిల్లాస్థాయి) ఆధ్వర్యంలో 154 బృందాలు సర్వే చేపట్టాయి. ప్రతి బృందంలో ఒక మండల స్థాయి అధికారితోపాటు ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక పంచాయతీ కార్యదర్శితోపాటు బ్యాంకు అధికారి సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపాలిటీలోని 13, 16, 29వ వార్డులతోపాటు ఇదే మండలంలోని సింగాపూర్, జూపాక, రాంపూర్, రంగాపూర్, ధర్మరాజుపల్లిలో సర్వే నిర్వహించారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 2, 5,10, 13, 14వ వార్డులతోపాటు ఇదే మండలంలోని కోరపల్లి, తనుగుల, బిజిగిరి, నాగంపేట, నగురం గ్రామాలో సర్వే చేశారు. ఇల్లందకుంట మండలకేంద్రంతోపాటు కనగర్తి, సిరిసేడు, మల్యాలలో సర్వే చేపట్టారు. వీణవంక మండల కేంద్రంతోపాటు బేతిగల్, ఘన్ముక్ల, వల్భాపూర్, మామిడాలపల్లి, బొంతుపల్లి, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించారు. కమలపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టారు. నిత్యం ప్రతిబృందం 35 నుంచి 50 కుటుంబాల వరకు సర్వే చేయనున్నది. సెప్టెంబర్ 3 వరకు దాదాపు వారంపాటు సర్వే కొనసాగనున్నది.
సర్వే బృందాలకు ఘన స్వాగతం
సర్వే కోసం వచ్చిన బృందాలకు దళిత వాడల్లో ఘనస్వాగతం లభించింది. తిలకం దిద్ది, మంగళహారతులు పట్టి తమ వాడలకు అధికారులను ఆహ్వానించారు. పూలదండలు వేసి, శాలువాలు కప్పి సన్మానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. డప్పుచప్పుళ్లతో, పటాకులు కాల్చి సాదరస్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు