దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో.. ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఏవమ్ జగత్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల సన్నాహాల్లో ఉందీ చిత్రం. తాజాగా ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్ సాంగ్’ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలకపాత్రలో నటించిన అనన్య నాగళ్ళ విడుదల చేశారు. ‘‘ఉదయించే సూర్యిడిలా.. ప్రతిరోజు నిను చూసా..జనియించిందే.. ఒక స్వప్నం..” అనే పల్లవితో సాగిన ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్కు.. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఆలపించారు. పాటను విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్కు అనన్య నాగళ్ళ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా..? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమే ‘ఏవమ్ జగత్’ అన్నారు దర్శకుడు దినేష్ నర్రా. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం భవిష్యత్తు ఏంటి? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా? అనే అంశాలను ప్రధానంగా ఈ మూవీలో చూపిస్తున్నాం.
వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి కథే ‘ఏవం జగత్’. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేస్తాం.. అని తెలిపారు.